జమ్మికుంటలో వర్షపు నీటి ముంపు ప్రాంతాలను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 24: జమ్మికుంట పట్టణంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. పట్టణ పరిధిలోని 6, 22, 30వ వార్డులకు చెందిన హౌసింగ్ బోర్డ్ కాలనీ, అంబేద్కర్ కాలనీ, నాయిని చెరువు పరిసర ప్రాంతాలను ఆయన స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, వర్షాకాలంలో వరద నీటి వల్ల పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్ యంత్రాంగం అన్ని రకాల ముందస్తు చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు. నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. తమ పాలకవర్గం అనునిత్యం పట్టణ ప్రజలకు అందుబాటులో ఉంటుందని, వర్షాల వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తినా ప్రజలు వెంటనే మున్సిపల్ టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదించాలని ఆయన కోరారు. ఈ పర్యటనలో స్థానిక కౌన్సిలర్లు పొనగంటి రాము, చందా రాజు, శ్రీపతి నరేష్, మంద రాజేష్, బోళ్ల సదానందం తదితరులు పాల్గొని ముంపు సమస్యలపై చైర్మన్కు వివరించారు.

