ఎమర్జెన్సీ చీకటి రోజులను ఎదిరించి హిందూ ధర్మ స్థాపనకై పోరాడాం: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సీనియర్ నాయకులు
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 25: దేశ చరిత్రలోనే అత్యంత నల్లటి రోజులుగా భావించే ఎమర్జెన్సీ కాలంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ, ఆ ఆంక్షలకు ఎవరూ భయపడలేదని ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకులు స్పష్టం చేశారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వాన్ని ఎదిరించి, జైలు గోడల మధ్య కూడా ఆర్ఎస్ఎస్ శాఖలను విజయవంతంగా నడిపామని వారు గుర్తుచేసుకున్నారు. ఒక నిబద్ధత కలిగిన స్వయంసేవక్గా సమాజంలో హిందూ ధర్మ స్థాపన కోసం, దేశంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం నాడు అకుంఠిత దీక్షతో పనిచేశామని వారు వివరించారు.

ప్రభుత్వ అణచివేత వైఖరిని ధీటుగా ఎదుర్కొంటూ దేశం కోసం సుమారు మూడు నెలల పాటు జైలు జీవితాన్ని గడిపామని, నాడు పడిన కష్టానికి నేడు దేశంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని జాతీయవాద ప్రభుత్వం అధికారంలో ఉండటం తమకు ఎనలేని సంతోషాన్ని, గర్వాన్ని కలిగిస్తోందని జమ్మికుంటకు చెందిన మంతెన శ్రీమన్నారాయణ, హుజురాబాద్కు చెందిన కొమురవెల్లి సదానందం ఘనంగా ప్రకటించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజు, మాజీ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ శ్రీనివాస్ పాల్గొని సంఘ్ పెద్దల త్యాగాలను కొనియాడారు. వీరితో పాటు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రముఖులు గుత్తికొండ రాజశేఖర్, ఆవాల రాజారెడ్డి, దాసరి రవీందర్, బుర్ర శివయ్య, కేతపల్లి మాధవరెడ్డి, ఎక్కడి రఘుతం రెడ్డి, గుడి కందుల సుదర్శన్ తదితరులు పాల్గొని నాటి ఉద్యమ స్మృతులను నెమరవేసుకున్నారు.

