మహనీయుల త్యాగాల స్మరణ: కర్బాలా వీరుల బలిదానానికి ప్రతీక మొహర్రం
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 25: మహ్మద్ ప్రవక్త మనుమడైన హజ్రత్ ఇమామ్ హుస్సేన్ వీర మరణానికి ప్రతీకగా నిలిచిన మొహర్రం పండుగను ముస్లింలతో పాటు ఇతర మతస్థులు కూడా ఎంతో భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు. ఇస్లామియా క్యాలెండర్లో మొదటి నెల అయిన మొహర్రం విషాదంతోనే మొదలవుతుంది. ఈ నెలలోని 10వ తారీఖును “యౌమె అషురా” అని పిలుస్తారు. సుమారు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం, కర్బాలా మైదానంలో క్రూర నియంత యాజీద్ సైన్యానికి ఎదురొడ్డి, అల్లాహ్ ఆదేశాలను, ఇస్లాం ధర్మాన్ని పరిరక్షించడం కోసం హజ్రత్ ఇమామ్ హుస్సేన్ తన 72 మంది అనుచరులతో కలిసి ప్రాణాలర్పించారు. దాహంతో అలమటిస్తున్నా శత్రువుల దాడికి లొంగకుండా, చివరి నిమిషంలో ఒంటిపై గాయాలతో నెత్తురొడుతున్నా నమాజ్ చేస్తూ ఆయన శిరచ్ఛేదనానికి గురయ్యారు. ఈ సుదీర్ఘ పోరాటాన్ని, వారి వీర మరణాన్ని స్మరిస్తూ ప్రతి ఏటా మొదటి పది రోజులను శోకదినాలుగా పాటిస్తారు.ఈ పది రోజుల్లో ముస్లింలు ఎలాంటి ఆడంబరాలకు, శుభకార్యాలకు దూరంగా ఉంటారు. ముఖ్యంగా మొహర్రం 9, 10 తేదీలలో ఉపవాసాలు ఉంటూ హజ్రత్ హుస్సేన్ ఆత్మశాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. చివరి రోజైన ‘షహదత్’ నాడు ఇళ్లలో తయారు చేసిన తీపి పానీయాన్ని (షర్బత్) కొత్త కుండల్లో పోసి పిల్లలకు, పెద్దలకు పంచుతారు.

తెలుగు రాష్ట్రాల్లోని జమ్మికుంట, బిజీగిర్ షరీఫ్, మడిపల్లి, తనుగుల, వావిలాల వంటి పలు గ్రామాలలో పీర్లను (ఆలం) అషురుఖానాలో ప్రతిష్టించి, అలావా (అగ్నిగుండం) ఏర్పాటు చేస్తారు. అనంతరం షహదత్ రోజున ఆ పీర్లను స్థానిక చెరువుల్లో నిమజ్జనం చేయడం ఒక సంప్రదాయంగా వస్తోంది.ఆచారాలు – అపోహలుకాలక్రమేణా మొహర్రం మాసం పట్ల సామాన్య ప్రజల్లో కొన్ని అపోహలు, మూఢాచారాలు నెలకొన్నాయని ఆధ్యాత్మిక నిపుణులు గుర్తుచేస్తున్నారు. హజ్రత్ ఇమామ్ హుస్సేన్ అమరగతులైన రోజున గుండెలు బాదుకోవడం (మాతం), నిప్పుల్లో దూకడం, పీర్లను ఊరేగించి దట్టీలు సమర్పించడం వంటివి ఇస్లాం సూత్రాలకు విరుద్ధమని, ఇవి బహుదైవారాధన (షిర్క్) కిందకే వస్తాయని పండితులు స్పష్టం చేస్తున్నారు. దైవ మార్గంలో ప్రాణాలర్పించిన వారు సజీవులని దివ్య ఖురాన్ పేర్కొన్నందున, వారి కోసం శోకించడం తగదని వివరిస్తున్నారు. అలాగే ఈ నెలలో పెళ్లిళ్లు చేసుకోకూడదనే నమ్మకం కూడా ఒక అపోహేనని, అన్ని రోజులు దైవానివేనని వారు చెబుతున్నారు. మూఢనమ్మకాలకు తావులేకుండా, మహనీయుల త్యాగనిరతిని స్మరిస్తూ మహ్మద్ ప్రవక్త చూపిన సన్మార్గాన్ని అనుసరించడమే నిజమైన లోకకళ్యాణానికి మార్గమని హితవు పలుకుతున్నారు.

