గచ్చిబౌలి AMB ఫ్లైఓవర్పై ఘోర రోడ్డు ప్రమాదం: రాంగ్ రూట్ ప్రయాణం ఇద్దరి ప్రాణాలు తీసిన వైనం
హైదరాబాద్,వి90న్యూస్,జూన్ 26: హైదరాబాద్లోని గచ్చిబౌలి ఏఎంబీ (AMB) ఫ్లైఓవర్పై ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్లైఓవర్పై రాంగ్ రూట్లో ప్రయాణిస్తున్న ఒక స్కూటీని, ఎదురుగా వస్తున్న బుల్లెట్ బైక్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందంటే, స్కూటీపై ప్రయాణిస్తున్న శ్రీకాంత్, విఠల్ అనే ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలతో ఘటనా స్థలంలోనే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అలాగే బుల్లెట్ బైక్పై ప్రయాణిస్తున్న వినోద్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో, అతడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.ఈ ప్రమాదంపై స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ ప్రాంతంలో వాహనదారులు తరచూ నియమాలను ఉల్లంఘిస్తూ, ప్రాణాలకు తెగించి రాంగ్ రూట్లో ప్రయాణిస్తుంటారని వారు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఇక్కడ నిరంతరం నిఘా ఉంచి, రాంగ్ రూట్ వాహనాలపై ముందే కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు ఈ ఘోర ప్రమాదం జరిగి ఉండేది కాదని స్థానికులు వాపోతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు జరుపుతున్నారు.

