కళాశాలలు అమ్ముకొని విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారు: సామాజిక కార్యకర్త గట్టు సాయిరాం మండిపాటు
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 29: జమ్మికుంట పట్టణంలోని ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థుల భవిష్యత్తును గాలికి వదిలేసి అన్యాయం చేస్తున్నాయని సామాజిక కార్యకర్త గట్టు సాయిరాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో గల స్రవంతి జూనియర్ కళాశాల, విస్డమ్ జూనియర్ కళాశాలలను యాజమాన్యాలు ఇతరులకు అమ్ముకున్నాయని, అయినప్పటికీ అక్కడ చదువుకున్న విద్యార్థుల సర్టిఫికెట్లను ఇంతవరకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు అప్పగించలేదని ఆరోపించారు. సర్టిఫికెట్ల కోసం వచ్చే విద్యార్థుల నుండి విపరీతంగా అధిక ఫీజులు డిమాండ్ చేస్తూ నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమై ఇన్ని రోజులవుతున్నా, ఆ రెండు కళాశాలలకు చెందిన ద్వితీయ సంవత్సరం (సెకండ్ ఇయర్) విద్యార్థులకు చదువు ఎక్కడ చెప్తున్నారో, వారి పరిస్థితి ఏమిటో అర్థం కాని గందరగోళం నెలకొందని సాయిరాం పేర్కొన్నారు. సర్టిఫికెట్ల కోసం ఎంతోమంది విద్యార్థులు ప్రతిరోజూ కళాశాలల చుట్టూ తిరుగుతున్నా యాజమాన్యాలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ప్రైవేట్ కళాశాలలు మూసివేసినప్పుడు ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, వాటిని తమ పరిధిలోకి తీసుకుని ప్రభుత్వ కళాశాలలకు అప్పగించాల్సి ఉండగా, బాధ్యతారహితంగా గాలికి వదిలేశారని విమర్శించారు. కాబట్టి విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పాత అధ్యాపకులతోనే విద్యాబోధన కొనసాగించేలా చూడాలని, అలాగే ఫీజుల పేరుతో వేధించకుండా విద్యార్థుల సర్టిఫికెట్లను త్వరగా అందజేసేలా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

