జమ్మికుంట మున్సిపాలిటీలో ఘనంగా కొణిజేటి రోశయ్య జయంతి వేడుకలు: నివాళులర్పించిన చైర్మన్, కమిషనర్
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 04: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు , కర్ణాటక రాష్ట్రాల మాజీ గవర్నర్ దివంగత కొణిజేటి రోశయ్య జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జమ్మికుంట మున్సిపాలిటీలో అత్యంత ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) అధ్యక్షతన, మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్, కమిషనర్లు మాట్లాడుతూ రోశయ్య ఉమ్మడి రాష్ట్రానికి అందించిన రాజకీయ, పరిపాలనా సేవలను కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం రోశయ్య జయంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించడం ఎంతో అభినందనీయమని వారు పేర్కొన్నారు.ఆర్థిక మంత్రిగా రోశయ్య ప్రవేశపెట్టిన బడ్జెట్లు, ప్రజా సంక్షేమానికి ఆయన చేసిన కృషి, ఉమ్మడి రాష్ట్ర అభివృద్ధికి అందించిన సేవలు చిరస్మరణీయమని స్మరించుకున్నారు. ఆయన నిజాయితీ, నిరాడంబరత, అద్భుత పరిపాలనా నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తాయని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో మున్సిపల్ మేనేజర్ జి. రాజిరెడ్డి, కౌన్సిలర్లు చందా రాజు, దిడ్డి కోమల, ఒగ్గు రమేష్, గుర్రం కావ్య, లక్ష్మణ్, కొలుగూరి సురేష్, పొనగంటి విష్ణు, యాట్ల సునీత అశోక్, మాచర్ల రాజు, కుతాడి తిరుపతిలతో పాటు మున్సిపల్ అధికారులు జేఏవో రాజశేఖర్ రెడ్డి, ఏఈ వికాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ (ఇన్చార్జ్) ఇల్లందుల రమేష్, దీపిక, టీపీబీవో, సీనియర్ అసిస్టెంట్ ఎం శ్రీనివాస్, వివిధ వార్డుల అధికారులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.

