డ్రగ్స్, అక్రమ రవాణాకు యువత దూరంగా ఉండాలి: అవగాహన సదస్సులో ఏసీపీ, సీఐ
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 04: యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి, సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని హుజురాబాద్ ఏసీపీ మాధవి, జమ్మికుంట పట్టణ సీఐ రామకృష్ణ పిలుపునిచ్చారు. శనివారం విలసాగర్ గ్రామంలో యువతకు వివిధ సామాజిక అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యువత డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉంటూ తమ బంగారు భవిష్యత్తును పాడుచేసుకోవద్దని హెచ్చరించారు. అలాగే ఎలాంటి ఇసుక అక్రమ రవాణా వంటి చట్టవ్యతిరేక పనులకు పాల్పడవద్దని, చట్టాన్ని గౌరవిస్తూ బాధ్యతాయుతంగా నడుచుకోవాలని సూచించారు.గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించిన వారు, గ్రామ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం యువతతో కలిసి సమాజ హితం కోసం, వ్యసనాలకు దూరంగా ఉంటామంటూ ప్రతిజ్ఞ (ప్లెడ్జ్) చేయించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది , గ్రామ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

