భారీ రాజకీయ సంచలనం: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా!
డిల్లీ,వి90 న్యూస్,జూలై 25: నీట్ (NEET) ప్రశ్నాపత్రం లీకేజీ వివాదం, జాతీయ స్థాయి పోటీ పరీక్షల నిర్వహణలో తలెత్తిన తీవ్ర లోపాలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. గత కొంతకాలంగా నీట్ అక్రమాలపై విద్యార్థులు, యువజన సంఘాలు రాజధాని ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించడమే కాకుండా, పరీక్షల వ్యవస్థను ప్రక్షాళన చేయాలని, విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని గట్టిగా డిమాండ్ చేశారు. ఈ పరిణామాల నడుమ కేంద్ర ప్రభుత్వం పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు’ ముసాయిదాను రూపొందించి, కఠిన శిక్షలు , ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ వంటి కీలక ప్రతిపాదనలు ముందుకు తెచ్చినప్పటికీ విద్యార్థుల నిరసనలు ఆగలేదు. ఈ విమర్శలు, విద్యార్థుల ఆందోళనల ఒత్తిడి తీవ్రతరం కావడంతో ధర్మేంద్ర ప్రధాన్ తన పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. కాగా, ఈ రాజీనామాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల కానుండగా, రాష్ట్రపతి ఆమోదం కూడా లభించాల్సి ఉంది. ఈ రాజీనామాతో కేంద్ర మంత్రివర్గంలో ఖాళీ అయిన విద్యాశాఖ బాధ్యతలను ఎవరు చేపడతారనే దానిపై ఇప్పుడు సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను విద్యార్థి సంఘాలు ఆహ్వానిస్తూనే, కేవలం రాజీనామాలతో సరిపెట్టకుండా పరీక్షల నిర్వహణలో పూర్తి పారదర్శకతను పునరుద్ధరించాలని మరియు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

