‘సై’ భిక్షూ యాదవ్, ‘గజిని’ విలన్ ప్రదీప్ రావత్ గుండెపోటుతో హఠాన్మరణం
ముంబై,వి90 న్యూస్,ఆగస్టు 04: తెలుగుతో పాటు దక్షిణాది, హిందీ సినీ పరిశ్రమల్లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ (74) గుండెపోటుతో అకస్మాత్తుగా కన్నుమూశారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘సై’ చిత్రంలో ‘భిక్షూ యాదవ్’ పాత్రలో ఆయన చూపించిన భయానక నటన ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ ఒక్క సినిమాతో టాలీవుడ్లో తిరుగులేని విలన్గా మారిన ఆయన, ఆ తర్వాత ‘ఛత్రపతి’, ‘గజిని’ వంటి ఇండస్ట్రీ హిట్లలో ప్రధాన ప్రతినాయకుడిగా నటించి మెప్పించారు. బాలీవుడ్ ప్రముఖ చిత్రం ‘లాగాన్’తో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఆయన, ఆ తర్వాత దక్షిణాది వైపు అడుగులు వేసి తన గంభీరమైన స్వరం, ఆకారంతో విలనిజానికి కొత్త అర్థం చెప్పారు. కేవలం భయంకరమైన ప్రతినాయకుడిగానే కాకుండా పలు చిత్రాల్లో విలక్షణమైన పాత్రలతోనూ ఆకట్టుకున్నారు. ఆయన హఠాన్మరణ వార్త తెలిసి సినీ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. పలువురు అగ్ర నటులు, దర్శకులు, నిర్మాతలు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు. అభిమానులు, సినీ ప్రముఖులు ఆయన కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

