హుజూరాబాద్లో పోలీసుల నూతన విశ్రాంతి భవనాన్ని ప్రారంభించిన సీపీ గౌష్ ఆలం
హుజూరాబాద్, ఏప్రిల్ 29:పోలీసు సిబ్బంది సంక్షేమం వసతి సౌకర్యాల మెరుగుదలే లక్ష్యంగా హుజూరాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్మించిన నూతన “అమరవీరుల స్మారక బ్యారక్ సిబ్బంది విశ్రాంతి భవనాన్ని” కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను నిరంతరం స్మరించుకునేలా ఈ భవనానికి వారి పేరు పెట్టామని వివరించారు. ప్రజల రక్షణ కోసం అహర్నిశలు శ్రమించే పోలీసులకు మెరుగైన వసతులు కల్పించినప్పుడే వారి సేవా దృక్పథం మరింత బలపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.సిబ్బంది ఆరోగ్యం, సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఆధునిక వాతావరణాన్ని కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని సీపీ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ముఖ్యంగా అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు సిబ్బంది వేగంగా స్పందించడానికి ఇటువంటి వసతి గృహాలు ఎంతో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ ఏసీపీ వి. మాధవి, ఇన్స్పెక్టర్లు కరుణాకర్, శ్రీనివాస్, రామకృష్ణలతో పాటు ఎస్సైలు తిరుపతి, స్వాతి, క్రాంతి , ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
