ఇల్లందకుంట జిల్లా పరిషత్ పాఠశాల ఘనత: పదవ తరగతి ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత
ఇల్లందకుంట, ఏప్రిల్ 29: నేడు విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. పాఠశాల నుండి పరీక్షలు రాసిన మొత్తం 47 మంది విద్యార్థులూ ఉత్తీర్ణత సాధించి, వంద శాతం ఫలితాలతో పాఠశాల కీర్తిని చాటారు. ఈ అద్భుత విజయంతో ఇల్లంతకుంట మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఈ స్కూల్ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోగా, మండల స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచింది.పాఠశాల విద్యార్థుల్లో తిప్పరపోయిన రితీష్ 538 మార్కులతో ప్రథమ స్థానాన్ని సాధించగా, కొల్లూరు సిరి 535 మార్కులతో ద్వితీయ స్థానాన్ని, మరియు ఇల్లందుల అభిరామ్ 534 మార్కులతో తృతీయ స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు తస్లీమ్ నజ్మీన్ మాట్లాడుతూ, విద్యార్థుల కష్టానికి ఉపాధ్యాయుల కృషి తోడవ్వడం వల్లే ఈ అసాధారణ ఫలితాలు సాధ్యమయ్యాయని హర్షం వ్యక్తం చేశారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పుష్పగుచ్చాలు అందించి ప్రత్యేకంగా అభినందించారు. వచ్చే విద్యా సంవత్సరంలో కూడా ఇదే స్ఫూర్తితో పని చేస్తామని, అడ్మిషన్ల సంఖ్యను పెంచి పాఠశాలను మండలంలోనే అగ్రగామిగా నిలబెడతామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి కొర్ర రాములుతో పాటు ఉపాధ్యాయులు కె. జయప్రకాష్, సిహెచ్. వేణు, కే. శంకర్, కే. సత్యం, ఎం. సమిరెడ్డి, సిహెచ్. కౌసల్య, జి. అన్నపూర్ణ, సిహెచ్. రామకృష్ణ, ఏ. సురేష్, ఎం. ఐలయ్య, డి. ఉమాదేవి, ఆర్. దేవేందర్, డి. పరమేశ్వర్, వనిత, స్రవంతి, విశ్వతేజ తదితరులు పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
