అక్రెడిటేషన్ కమిటీ నిర్ణయాలను నిలిపివేయండి: హైకోర్టులో టీడబ్ల్యూజేఎఫ్ పిటిషన్
హైదరాబాద్, మే 06: తెలంగాణ రాష్ట్ర , జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీలు తీసుకునే నిర్ణయాలను నిలిపివేయాలంటూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మీడియా అక్రెడిటేషన్ కార్డుల జారీ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిటీలలో తమ సంఘానికి ప్రాతినిధ్యం కల్పించకుండా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య తన పిటిషన్లో పేర్కొన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 252 ప్రకారం అక్రెడిటేషన్ కమిటీలో నాలుగు జర్నలిస్టు యూనియన్ల ప్రతినిధులు ఉండాల్సి ఉండగా, కేవలం మూడు యూనియన్ల ప్రతినిధులను మాత్రమే తీసుకున్నారని ఆయన ఆరోపించారు. తమ యూనియన్ ప్రతినిధులను తీసుకోకుండా ప్రక్రియను పెండింగ్లో పెట్టి కార్డులపై నిర్ణయాలు తీసుకోవడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. ఈ మేరకు ఐఅండ్ పీఆర్ స్పెషల్ కమీషనర్, మీడియా అకాడమీ ఛైర్మన్ మరియు రాష్ట్రంలోని 33 జిల్లాల డీపీఆర్వోలను ఈ పిటిషన్లో ప్రతివాదులుగా చేర్చారు.మరోవైపు అక్రెడిటేషన్ కమిటీల ఏర్పాటు కోసం జారీ చేసిన జీవో ఆర్టీ 229ను రద్దు చేయాలని కోరుతూ టీడబ్ల్యూజేఎఫ్ సభ్యుడు మరియు ఏవీఎన్ టీవీ కరస్పాండెంట్ నంబి పర్వతాలు కూడా హైకోర్టులో కేసు ఫైల్ చేశారు. జీవో 252 మార్గదర్శకాలకు విరుద్ధంగా జీవో 229 ద్వారా కేవలం మూడు సంఘాల ప్రతినిధులను మాత్రమే కమిటీలోకి తీసుకోవడం అన్యాయమని ఆయన తన అభ్యంతరంలో వ్యక్తం చేశారు. టీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులను పక్కన పెట్టి కమిటీ నిర్ణయాలు తీసుకోవడం జీవో 252 స్ఫూర్తికే విరుద్ధమని, అందుకే జీవో ఆర్టీ 229ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆయన కోర్టును కోరారు. ఈ పిటిషన్లో కూడా సమాచార శాఖ ఉన్నతాధికారులతో పాటు అన్ని జిల్లాల పౌర సంబంధాల అధికారులను ప్రతివాదులుగా పేర్కొంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
