జమ్మికుంట పట్టణ అభివృద్ధికి ప్రజలు సహకరించాలి: మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్
జమ్మికుంట, మే 05 : జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) పట్టణ పరిధిలోని పలు వార్డుల్లో పర్యటించి శానిటేషన్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పట్టణంలోని 30 వార్డులకు సంబంధించి పారిశుద్ధ్య విభాగంలో కీలక మార్పులు చేపడుతూ, జవాన్లను సవరిస్తూ నూతనంగా ‘టీమ్ వర్క్’ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో 5, 8, 23 వార్డులను సందర్శించిన ఆయన, శానిటేషన్ సిబ్బంది చేస్తున్న సామూహిక పనులను స్వయంగా పర్యవేక్షించారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ జమ్మికుంట పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు తమ పాలకవర్గం నిరంతరం కృషి చేస్తోందని, ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. పారిశుద్ధ్య నిర్వహణలో మార్పులు తీసుకువచ్చి పనులను మరింత వేగవంతం చేస్తున్నామని, ఈ ప్రక్రియలో ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా మున్సిపాలిటీకి సహకరించాలని ఆయన కోరారు. పట్టణ ప్రగతిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్, కౌన్సిలర్లు యట్ల సునీత అశోక్, కోలుగురి సురేష్, చింతల శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్ , ఇతర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
