కొత్తగూడెం రైల్వే డివిజన్ ఏర్పాటు దిశగా కేంద్రం అడుగులు: ఎంపీ వద్దిరాజు వినతిపై స్పందించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
భద్రాద్రి కొత్తగూడెం మే 06: భద్రాచలం రోడ్ (కొత్తగూడెం) కేంద్రంగా నూతన రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్పై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ ప్రతిపాదన ప్రస్తుతం కేంద్ర రైల్వే శాఖ పరిశీలనలో ఉందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఉపనేత, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గతంలో అందజేసిన వినతిపత్రానికి సమాధానంగా మంత్రి ఒక లేఖ రాశారు.భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్ వందేళ్ల చరిత్రను కలిగి ఉన్న నేపథ్యంలో, దాని ప్రాధాన్యతను గుర్తిస్తూ ప్రత్యేక డివిజన్ను ఏర్పాటు చేయాలని పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎంపీ రవిచంద్ర కేంద్ర మంత్రిని కోరారు. కొత్తగూడెం నుంచి కిరండోల్, మల్కాన్గిరి, కొవ్వూరు రైల్వే లైన్లు గనుక పూర్తయితే తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు మెరుగైన రవాణా అనుసంధానత లభిస్తుందని ఆయన తన వినతిలో వివరించారు. ఈ ప్రతిపాదనను సీరియస్గా తీసుకున్న రైల్వే మంత్రి, దీనిని తదుపరి సమీక్ష కోసం ఉన్నతాధికారుల బృందానికి పంపినట్లు పేర్కొన్నారు. అధికారుల పరిశీలన పూర్తి కాగానే నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపడతామని ఎంపీ రవిచంద్రకు పంపిన ప్రత్యుత్తరంలో మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
