జనాభా గణన వివరాలను వ్యక్తిగతంగా నమోదు చేసుకోవచ్చు: జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున స్వామి వెల్లడి
జమ్మికుంట మే 06: ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన జనాభా గణన ప్రక్రియలో భాగంగా వివరాలను వ్యక్తిగతంగా నమోదు చేసుకోవాలనుకునే వారికి ఈ నెల 10వ తేదీ వరకు అవకాశం ఉందని జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. 2026-27 జనాభా గణన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపాలిటీ పరిధిలో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఈ నెల 11వ తేదీ నుండి ఎన్యూమరేటర్లు నేరుగా ప్రతి ఇంటికి వచ్చి వివరాలను సేకరిస్తారని, సెన్సెస్ ఫామ్లో పొందుపరిచిన ప్రతి అంశాన్ని ప్రజల సహకారంతో నింపి ఈ ప్రక్రియను పూర్తి చేస్తారని కమిషనర్ వివరించారు. ఈ సర్వే నిర్వహణలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. జనాభా గణన కార్యక్రమం విజయవంతం కావడానికి అన్ని వర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధులు పూర్తిస్థాయిలో సహకరించి ఎన్యూమరేటర్లకు సరైన వివరాలు అందించాలని మల్లికార్జున స్వామి విజ్ఞప్తి చేశారు.
