వావిలాల శివారులో దగ్ధమైన మొక్కజొన్న పంట: నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని గంగాడి కృష్ణారెడ్డి డిమాండ్
జమ్మికుంట మే 06: జమ్మికుంట మండలం వావిలాల గ్రామ శివారులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సుమారు 50 ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి కావడంపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం స్థానిక బీజేపీ నాయకులతో కలిసి ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఆయన, పంట నష్టపోయిన రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం మరియు ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణలో లోపాల వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని ఆయన మండిపడ్డారు.చేతికొచ్చిన పంట కళ్లముందే బుగ్గిపాలు కావడంతో రైతులు మరియు కౌలు రైతులు కోలుకోలేని దెబ్బ తిన్నారని, గతంలోనూ ఇదే ప్రాంతంలో పలుమార్లు ఇలాంటి ప్రమాదాలు జరిగినా అధికారులు పాఠాలు నేర్చుకోకపోవడం దారుణమని విమర్శించారు. ఏటా అధికారుల నిర్లక్ష్యానికి రైతులు బలికావాల్సి వస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని, అలాగే విద్యుత్ శాఖ కూడా ఈ ఘటనకు బాధ్యత వహించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ పర్యటనలో బీజేపీ మండల అధ్యక్షుడు దొంతర రమేష్ యాదవ్, పుప్పాల రఘు, ఆకుల రాజేందర్ మరియు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
