కొత్తపల్లిలో నీటి కష్టాలు: 19వ వార్డులో చుక్క నీరు రాక జనం విలవిల

0
100546264

జమ్మికుంట, మే 06: మే నెల ఎండలు మండుతుండటంతో కొత్తపల్లి గ్రామస్తులు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గ్రామంలోని బండ ఏరియాలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోర్లు పోయడం లేదని, దీంతో ప్రజలు పూర్తిగా మిషన్ భగీరథ నీటిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే గత పది రోజులుగా 19వ వార్డులో అసలు నీటి సరఫరా జరగకపోవడంతో స్థానికులు అల్లాడిపోతున్నారు. ఈ సమస్యపై మున్సిపల్ అధికారులను, చైర్మన్ , వైస్ చైర్మన్‌లను ఆశ్రయించగా, కరీంనగర్ నుండే మిషన్ భగీరథ నీరు రావడం లేదని, తామేమీ చేయలేమని సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని వార్డు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వేసవి తీవ్రత దృష్ట్యా నీరు లేనిదే రోజువారీ పనులు కూడా సాగడం లేదని, కనీసం తాగడానికి కూడా నీళ్లు దొరకడం లేదని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైపులైన్ ద్వారా నీటి సరఫరా పునరుద్ధరించడానికి సమయం పడితే, ప్రత్యామ్నాయంగా మున్సిపల్ వాటర్ ట్యాంకర్ల ద్వారా అయినా నీటిని సరఫరా చేసి ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పాలకవర్గం వెంటనే స్పందించి 19వ వార్డు ప్రజల దాహార్తిని తీర్చాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed