రోడ్లపై ధాన్యం ఆరబోత: ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ఎస్.ఐ కి విన్నపం
వీణవంక,వి90న్యూస్, మే 09: గ్రామీణ ప్రాంతాల్లో సరైన కల్లాలు లేక రైతులు అనివార్య పరిస్థితుల్లో ధాన్యాన్ని రోడ్లపైనే ఆరబోస్తున్నారని, ఈ క్రమంలో జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు తక్షణ జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యమకారుడు పత్తి వేణుగోపాల్ రెడ్డి వీణవంక ఎస్.ఐకి వినతిపత్రం సమర్పించారు. గ్రామాల్లో ధాన్యం ఆరబెట్టే స్థలాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు రోడ్లను ఆశ్రయించాల్సి వస్తోందని, ఈ విషయంలో రైతులపై కఠిన చర్యలు తీసుకోవడం కంటే ప్రాణనష్టం జరగకుండా ముందస్తు రక్షణ చర్యలపై దృష్టి సారించాలని ఆయన కోరారు.ధాన్యం ఆరబోసిన ప్రాంతాల్లో వాహనదారులు దూరం నుంచే అప్రమత్తం అయ్యేలా బ్యారికేడ్లు, హెచ్చరిక బోర్డులు మరియు రాత్రి వేళల్లో స్పష్టంగా కనిపించే రిఫ్లెక్టివ్ సూచికలను ఏర్పాటు చేయాలని సూచించారు. వీటి ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా, రైతులకు ధాన్యం ఆరబోసుకోవడానికి ప్రత్యామ్నాయ స్థలాలను కేటాయించేలా సంబంధిత అధికారులతో మాట్లాడి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. ప్రజల ప్రాణ భద్రతను కాపాడుతూనే, అన్నదాతల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.
