జమ్మికుంటలో వైభవంగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు: పాల్గొన్న వొడితల ప్రణవ్
జమ్మికుంట,వి90 న్యూస్, మే 09: నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడతల ప్రణవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గృహ ప్రవేశం చేస్తున్న లబ్ధిదారులు ఆయనకు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా వొడతల ప్రణవ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ నియోజకవర్గానికి తొలి విడతలో 3,500 ఇళ్లను మంజూరు చేశామని గుర్తుచేశారు. లబ్ధిదారులు తమ సొంతింటి కలను సాకారం చేసుకుని, సంతోషంగా నూతన గృహాల్లోకి అడుగుపెడుతుంటే వారి కళ్లలో కనిపిస్తున్న ఆనందం వెలకట్టలేనిదని ఆయన భావోద్వేగంతో పేర్కొన్నారు.పేదలందరికీ సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని, అందులో భాగంగానే రెండవ విడత ఇళ్ల మంజూరు ప్రక్రియను కూడా వేగవంతం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ నెలాఖరులోగా మరిన్ని ఇళ్లను మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు , కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
