అదనపు కట్నం కోసం వివాహితపై వేధింపులు: భర్త, అత్తమామలపై కేసు నమోదు
మడిపల్లి/జమ్మికుంట,వి90 న్యూస్, మే 10: అదనపు కట్నం కోసం ఓ వివాహితను శారీరకంగా, మానసికగా వేధింపులకు గురిచేస్తున్న భర్తతో పాటు మరో ఐదుగురిపై జమ్మికుంట పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన ఇగ్గేటి అనూషకు, ఉల్లంపల్లి గ్రామానికి చెందిన బుల్లి అజయ్కుమార్తో గతేడాది పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో అనూష తల్లిదండ్రులు ఎకరం భూమితో పాటు ఎనిమిది లక్షల రూపాయల నగదు, ఇతర లాంఛనాలను కట్నంగా సమర్పించారు. వివాహమైన కొద్ది నెలల పాటు వీరి సంసారం సాఫీగానే సాగినప్పటికీ, ఆ తర్వాత అజయ్కుమార్ మద్యానికి బానిసయ్యాడు. నిత్యం మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యను అసభ్య పదజాలంతో దూషించడం మొదలుపెట్టాడు.ఈ విషయాన్ని అనూష తన అత్త రమ, మామ కొమురయ్య, బావ రంజిత్, ఆడపడుచు మమత దృష్టికి తీసుకెళ్లగా, వారు అజయ్కు మద్దతుగా నిలిచారు. అంతేకాకుండా అదనంగా మరో ఐదు లక్షల రూపాయల కట్నం తీసుకువస్తేనే ఇంట్లో ఉండాలని, లేదంటే వెళ్ళిపోవాలని వేధింపులకు పాల్పడ్డారు. ఈ క్రమంలోనే ఆమెను ఇంటి నుండి గెంటివేయడంతో, గత నెల 22న పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. అయినా సరే అత్తగారి తరపు వారి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో, బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తనను వేధిస్తున్న భర్త, అత్తమామలు, బావ మరియు ఆడపడుచుపై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
