నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి: ఎన్.ఎస్.యు.ఐ. డిమాండ్
విజయవాడ, వి90 న్యూస్ ,మే 12: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) యూజీ 2026 పరీక్షల ప్రశ్నాపత్రం లీకేజీ ఉదంతంపై ఎన్.ఎస్.యు.ఐ. రాష్ట్ర కోఆర్డినేటర్ వేముల శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, పదేపదే వైఫల్యాలకు కారణమవుతున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టి ఏ) గుర్తింపును రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వరుసగా జరుగుతున్న పేపర్ లీకులతో విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని, పరీక్షా విధానంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే పారదర్శకత, విశ్వసనీయతను కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.దేశవ్యాప్తంగా సుమారు 22 లక్షల 79 వేల 743 మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తుతో ఎన్ టి ఏ తన నిర్లక్ష్య వైఖరితో చలగాటమాడుతోందని శ్రీనివాస్ విమర్శించారు. ఎంతో కష్టపడి చదివి, వైద్యులుగా సమాజానికి సేవ చేయాలనుకున్న విద్యార్థుల కలలు ఈ లీకేజీల వల్ల ప్రశ్నార్థకంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్త ప్రవేశ పరీక్షల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ఎన్ టి ఏ, తన బాధ్యతలను విస్మరించి పదేపదే విఫలం కావడం గతంలోని సంఘటనల ద్వారా స్పష్టమవుతోందని ధ్వజమెత్తారు.కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేపర్ లీకేజీలు సర్వసాధారణంగా మారిపోయాయని, ఇది విద్యార్థి లోకానికి తీరని అన్యాయమని ఆయన మండిపడ్డారు. ఒకవైపు దేశం ఆర్థిక సంక్షోభం, నిత్యావసరాల కొరతతో కొట్టుమిట్టాడుతుంటే, మరోవైపు కేంద్ర విద్యాశాఖ మంత్రి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. ముఖ్యంగా గ్రామీణ, పేద, వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులను విద్యకు దూరం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం తగదని వేముల శ్రీనివాస్ హెచ్చరించారు.
