కవితా.. నీ నీచ రాజకీయాలు మానుకో: మాజీ కార్పొరేషన్ చైర్మన్ రాజా వరప్రసాద్ ధ్వజం
రంగారెడ్డి ,వి90 న్యూస్, మే 13 : తెలంగాణ మాజీ కార్పొరేషన్ చైర్మన్, బిఆర్ఎస్ సీనియర్ నేత రాజా వరప్రసాద్ టిఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవితపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మైనర్ బాలికపై జరిగిన లైంగిక దాడి ఘటనలో బాధితురాలికి అండగా నిలవాల్సిన కవిత, రాజకీయ స్వార్థంతో బిఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేయడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ ఒక మైనర్ బాలికను ఫామ్ హౌస్ కు తీసుకెళ్లి, మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డారని స్వయంగా బాధితురాలు, ఆమె తల్లి ఆరోపిస్తుంటే, ఐదు రోజుల తర్వాత బయటకు వచ్చిన కవిత కొత్త రాజకీయ డ్రామాలకు తెరలేపారని ఆయన ఆరోపించారు. మహిళలకు అమ్మలా, అక్కలా ఉంటానని చెప్పే కవిత.. బాధితురాలు మైనరో, మేజరో అంటూ సన్నాయి నొక్కులు నొక్కడం ఆమె నీచ రాజకీయాలకు నిదర్శనమని రాజా వరప్రసాద్ నిప్పులు చెరిగారు.ఈ ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించాలని యావత్ తెలంగాణ సమాజం డిమాండ్ చేస్తుంటే, కవిత మాత్రం నిందితుడికి కొమ్ముకాసేలా మాట్లాడటం వెనుక కాంగ్రెస్, బిజెపిల కుట్ర దాగి ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయాలనే ఉద్దేశంతోనే కవితను అమ్ముడుపోయిన రాజకీయవేత్తగా మార్చి, కొత్త పార్టీ పెట్టించి విమర్శలు చేయిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఒక మహిళ అయి ఉండి బాధితురాలి ఆవేదనను అర్థం చేసుకోకుండా మాట్లాడటం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో తీహార్ జైలులో శిక్ష అనుభవించినా కవితకు బుద్ధి రాలేదని, ఇప్పటికైనా ఇటువంటి డ్రామాలు ఆపి రేపిస్టులకు మద్దతు ఇచ్చే బిజెపిలో చేరాలని హితవు పలికారు. మైనర్ బాలికకు అన్యాయం చేసేలా వ్యవహరిస్తున్న కవిత, వారణాసికి వెళ్లి మోడీ జపం చేస్తూ గంగలో దూకడం ఉత్తమమని రాజా వరప్రసాద్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
