జమ్మికుంట మున్సిపల్ కార్యాలయం వద్ద దళిత బంధు లబ్ధిదారుల ఆందోళన: స్పందించిన చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్
జమ్మికుంట, వి90 న్యూస్, మే 15: జమ్మికుంట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద దళిత బంధు పథకం లబ్ధిదారులు చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. పథకం అమలులో జరుగుతున్న ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధితులు కార్యాలయం ముందు బైఠాయించారు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ తక్షణమే అక్కడికి చేరుకుని నిరసనకారులతో మాట్లాడారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, గత తెలంగాణ ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం ద్వారా ఇప్పటికే పలువురికి లబ్ధి చేకూరిందని వివరించారు. మొదటి విడత పొందిన వారితో పాటు, రెండో విడత కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకం అందేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ కృషి చేస్తామని బాధితులకు భరోసా కల్పించారు. చైర్మన్ హామీతో లబ్ధిదారులు తమ ఆందోళనను విరమించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్ తో పాటు కౌన్సిలర్లు చింతల శ్రీనివాస్, చంద రాజు, లక్ష్మణ్ , ఇతర నేతలు పాల్గొన్నారు.
