అంతర్రాష్ట్ర దేవాలయ దొంగల ముఠా గుట్టురట్టు: ముగ్గురు నిందితుల అరెస్ట్
సత్తుపల్లి ,వి90 న్యూస్, మే 15 : రెండు రాష్ట్రాల్లోని పలు దేవాలయాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను కల్లూరు పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. కల్లూరు శివారులోని మధిర రోడ్డులో ఎస్సై హరిత తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, రెండు ద్విచక్ర వాహనాలపై అనుమానాస్పదంగా వస్తున్న ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని వెంబడించి అదుపులోకి తీసుకుని, ఎంఎస్సిడి (MSCD) డివైస్ ద్వారా వేలిముద్రలను పరిశీలించగా, వారిలో ఇద్దరి వేలిముద్రలు పాత నేరస్తుల డేటాబేస్తో సరిపోలాయి.నిందితులను ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం ఓబులపాలేనికి చెందిన బోలుసు ఏసుబాబు, చాట్రాయి మండలం కోటపాడుకు చెందిన చేవూరి ఆదినారాయణ , వేంసూర్ మండలం ఎర్రగుంటపాడుకు చెందిన తుమ్మల మురళిగా గుర్తించారు. విచారణలో వీరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లోని దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని రెక్కీ నిర్వహించేవారని, రాత్రి సమయాల్లో హుండీలు పగులగొట్టి నగదు దోచుకునేవారని తేలింది. అలాగే కిరాణా షాపులు, పోస్ట్ ఆఫీసులను కూడా వీరు వదల్లేదని పోలీసులు వెల్లడించారు.గడిచిన ఆరు నెలలుగా చెన్నూరు, చిన్న కోరుకొండి, వెంకటగిరి, మల్లారం , ఆంధ్రప్రదేశ్లోని విస్సనపేట ప్రాంతాల్లోని ఆలయాల్లో వీరు చోరీలకు పాల్పడ్డారు. వీరి నుంచి దొంగతనానికి ఉపయోగించిన రెండు మోటార్ సైకిళ్లను, గడ్డపారను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన ఎస్సై హరిత , సిబ్బందిని ఏసీపీ వసుంధర యాదవ్ ప్రత్యేకంగా అభినందించారు.
