జమ్మికుంట మార్కెట్ యార్డుకు మక్కల రాకపై తాత్కాలిక నిలిపివేత: రైతులు సహకరించాలని చైర్మన్ పుల్లూరి స్వప్న విజ్ఞప్తి
జమ్మికుంట, వి90 న్యూస్, మే 14: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ రైతులకు ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం పత్తి మార్కెట్ యార్డులో మక్కల నిల్వలు భారీగా పేరుకుపోవడంతో, నిల్వ స్థలం లేక యార్డు పూర్తిగా నిండిపోయింది. ఈ అసాధారణ రద్దీ వల్ల తూకం, వేలం పాటలు , రవాణా ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. రైతులు మార్కెట్కు వచ్చి గంటల తరబడి వేచి ఉండి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో మే 15, 2026 శుక్రవారం నుండి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మక్కల రాకను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మార్కెట్ కమిటీ స్పష్టం చేసింది.గత కొన్ని రోజులుగా పరిసర గ్రామాల నుండి వేలాది క్వింటాళ్ల మక్కలు తరలిరావడంతో యార్డులో ట్రాక్టర్లు, లారీలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. యార్డులో ఇప్పటికే ఉన్న నిల్వలను పూర్తిగా క్లియర్ చేసిన తర్వాతే తిరిగి కొనుగోళ్లు ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు. అప్పటి వరకు రైతులు తమ పంటను గ్రామాల్లోనే భద్రపరుచుకోవాలని, అనుమతి లేకుండా యార్డుకు తీసుకువచ్చి రవాణా ఖర్చులు వృధా చేసుకోవద్దని సూచించారు.మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం మాట్లాడుతూ, మార్కెట్ యార్డులో పరిస్థితులు సాధారణ స్థితికి రాగానే కొత్త తేదీని ప్రకటిస్తామని తెలిపారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, రైతులందరూ మార్కెట్ కమిటీకి సహకరించి అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాలని ఆమె కోరారు.
