అజాగ్రత్తగా వాహనం నడిపి వ్యక్తిని ఢీకొట్టిన డీసీఎం: ఒకరికి తీవ్ర గాయాలు
జమ్మికుంట,వి90 న్యూస్,మే 15: జమ్మికుంట మండలం రంగమ్మపల్లి ఎల్లమ్మ గుడి సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం, జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ఆబాధి జమ్మికుంట గ్రామానికి చెందిన పిట్టల భద్రయ్య (40) కూలి పని చేసుకుంటూ జీవిస్తుంటాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం తన ద్విచక్ర వాహనంపై వడ్ల శాంపిల్స్ చూపించడానికి జగ్గయ్యపల్లికి వెళ్లి, తిరిగి ఇంటికి వస్తుండగా రంగమ్మపల్లి సమీపంలో వెనుక నుండి వచ్చిన డీసీఎం వ్యాన్ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భద్రయ్య తలకు , కుడి కంటికి తీవ్ర రక్త గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే 108 వాహనంలో జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం హన్మకొండలోని హాజర ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి కారణమైన డీసీఎం డ్రైవర్ రెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎలిబాక శ్రవణ్ కుమార్గా గుర్తించారు. భద్రయ్య భార్య స్వరూప ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
