సమిష్టి కృషితో మహానాడును జయప్రదం చేద్దాం: టిడిపి మాచర్ల ఇంచార్జి తాడిశెట్టి మురళీమోహన్
పల్నాడు,మాచర్ల,వి90 న్యూస్,మే 26: :తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు సమిష్టిగా కృషి చేసి మహానాడు కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా విజయవంతం చేయాలని మాచర్ల నియోజకవర్గ టిడిపి పరిశీలకులు, రాష్ట్ర టిడిపి కార్యానిర్వాహక కార్యదర్శి తాడిశెట్టి మురళీమోహన్ పిలుపునిచ్చారు. మహానాడు ఉత్సవాల నేపథ్యంలో సోమవారం రాత్రి మాచర్ల నియోజకవర్గ టిడిపి ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మాచర్ల నియోజకవర్గ నూతన ఇంచార్జిగా నియమితులైన తాడిశెట్టి మురళిమోహన్ను స్థానిక ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు అధికారికంగా పరిచయం చేశారు.

నియోజకవర్గ నూతన పరిశీలకుడిగా బాధ్యతలు చేపట్టిన మురళీమోహన్ను టిడిపి వర్గీయులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.అనంతరం జరిగిన ఈ సమావేశంలో మహానాడు ఏర్పాట్లు, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకునేందుకు క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై నియోజకవర్గ క్లస్టర్ ఇంచార్జిలు, బూత్ కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులతో కలిసి మురళీమోహన్ సుదీర్ఘంగా చర్చించారు. మహానాడు కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా రెట్టింపు ఉత్సాహంతో, సంతోషంతో కలిసికట్టుగా పనిచేయాలని ఆయన సూచించారు. మాచర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి నాయకత్వంలో టిడిపి ఒక తిరుగులేని, బలమైన శక్తిగా ఎదగాలని, అందుకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.

