కమలాపూర్లో అగ్నికి ఆహుతైన తాటి వనాలను పరిశీలించిన ఎంపీ ఈటల రాజేందర్; గీత కార్మికులను ఆదుకోవాలని డిమాండ్
హన్మకొండ/కమలాపూర్, వి90 న్యూస్ మే 26 :హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండల పరిధిలో ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైన తాటి వనాలను ఎంపీ ఈటల రాజేందర్ సందర్శించారు. ఈ ఘోర ప్రమాదంలో దాదాపు 1000 తాటి చెట్లు మంటల్లో కాలి బూడిదయ్యాయని, వాటిలో ప్రస్తుతం 100కు పైగా చెట్ల నుండి కల్లు గీస్తూ జీవనం సాగిస్తున్న గీత కార్మికులు తమ జీవనోపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తాటి చెట్లతో పాటు స్థానిక రైతుల మోటర్లు, పైపులు, వైర్లు సైతం పూర్తిగా కాలిపోయి తీవ్ర నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు. ఇంత పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినప్పటికీ, బాధితులను పరామర్శించేందుకు అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం అత్యంత విచారకరమన్నారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నష్టపోయిన గీత కార్మికులకు, రైతులకు తగిన ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన రైతులకు పలు సూచనలు చేశారు. పంట పొలాల్లో ఉండే వ్యర్థాలను తగులబెట్టవద్దని, అలా చేయడం వల్ల ఇలాంటి ఘోర ప్రమాదాలు జరిగి ఇతరులకు భారీ నష్టం వాటిల్లడమే కాకుండా, భూసారం కూడా దెబ్బతింటుందని హెచ్చరించారు. రైతులందరూ అప్రమత్తంగా ఉంటూ భవిష్యత్తులో ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఈటల రాజేందర్ కోరారు.

