జమ్మికుంటలో వైభవంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు ‘రేవంతన్న కానుక’ చీరల పంపిణీ
కరీంనగర్ /జమ్మికుంట, వి90 న్యూస్, మే 28: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఐదో వార్డులో ఇందిరా మహిళా శక్తి మహిళా స్వయం సహాయక సంఘం ఆధ్వర్యంలో అక్కాచెల్లెళ్లకు ‘మీ రేవంతన్న కానుక’ చీరల పంపిణీ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. వార్డు కౌన్సిలర్ యాట్ల సునీత అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సుంకరి రమేష్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు దేశిని కోటి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు దేశిని కోటి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడమే కాకుండా, భవిష్యత్తులో ఆ బస్సులకే వారిని యజమానులుగా మార్చే ప్రక్రియను ప్రభుత్వం కొనసాగిస్తోందని చెప్పారు. అలాగే మహిళా సంఘాల కోసం పక్కా భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ పంపుల నిర్వహణ బాధ్యతలను సైతం వారికి అప్పగించి యజమానులుగా ఎదిగేలా ప్రోత్సహిస్తున్నామని వివరించారు.

మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక అద్భుతమైన కార్యక్రమాలను తీసుకువస్తున్నారని, మహిళలు ఆర్థికంగా బలోపేతమైతేనే ఆయా కుటుంబాలు సంతోషంగా ఉంటాయనేది ప్రభుత్వ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాలకు ఇస్తున్న ప్రాధాన్యతను, చేస్తున్న అభివృద్ధిని సోదరీమణులంతా గమనించాలని, కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని ఎల్లప్పుడూ ఆశీర్వదించి దీవించాలని ఆయన కోరారు. ఈ విస్తృతస్థాయి పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పిట్టల రమేష్, రాజకుమార్, ప్రశాంత్, శివకృష్ణలతో పాటు వివిధ మహిళా సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, ఆర్పీలు, వీఓలు , స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

