బిజిగిరి షరీఫ్ దర్గాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం: వొడితల ప్రణవ్
కరీంనగర్/జమ్మికుంట, వి90 న్యూస్, మే 29: జమ్మికుంట మండల పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బిజిగిరి షరీఫ్ దర్గాలో ఉర్సు ఉత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల సందర్భంగా హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ దర్గాను సందర్శించారు.

శుక్రవారం దర్గాకు చేరుకున్న ఆయనకు దర్గా కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రణవ్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, పవిత్ర చాదర్ను సమర్పించారు.ఈ సందర్భంగా వొడితల ప్రణవ్ మాట్లాడుతూ, బిజిగిరి షరీఫ్ దర్గాకు కేవలం కరీంనగర్ జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని పేర్కొన్నారు.

దర్గాకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు, ముందస్తు ఏర్పాట్లు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఈ దర్గాను అన్ని విధాలుగా మరింత అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ సభ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

