అగ్ని ప్రమాద బాధితులను ఆదుకుంటాం: వొడితల ప్రణవ్
హన్మకొండ/కరీంనగర్, వి90 న్యూస్,మే 29: జమ్మికుంట, కమలాపూర్ మండలాల్లో ఇటీవల ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదాలు సంభవించిన ప్రాంతాలను హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ శుక్రవారం స్థానిక నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జమ్మికుంట మండల పరిధిలోని తనుగుల, మడిపల్లి, అంకుశాపూర్ గ్రామాల్లో, అలాగే కమలాపూర్ మండలంలో అగ్నికి ఆహుతి అయిన తాటి చెట్లను, దెబ్బతిన్న ఇళ్లను ఆయన నిశితంగా పరిశీలించి బాధితులను పరామర్శించారు.

ఈ సందర్భంగా ప్రమాదానికి గల కారణాలను అక్కడున్న గౌడ సోదరులు ఆయనకు వివరించారు.ఈ ఘటనపై వొడితల ప్రణవ్ మాట్లాడుతూ, అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే స్పందించి, నష్టాన్ని తక్షణమే అంచనా వేయాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. సంఘటన స్థలం నుంచే ఆయన అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి పరిస్థితి తీవ్రతను వివరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే రైతులు పొలాల్లో వరి కొయ్యలను కాల్చవద్దని, అది పర్యావరణానికి హాని చేయడమే కాకుండా ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతుందని సూచించారు.

ఈ విషయంలో రైతులకు తగిన అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పర్యటనలో పలు గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు, పట్టణ, మండల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

