జనగామ జిల్లాలో భారీ దొంగతనం: వృద్ధురాలి మెడలో 5 తులాల బంగారం అపహరణ, బైక్ వదిలేసి పారిపోయిన దొంగ!
జనగామ ,వి90 న్యూస్,మే 29: జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెద్దమడూరు గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున ఒక భారీ దొంగతనం కలకలం సృష్టించింది. ప్రస్తుతం ఎండాకాలం కావడంతో ప్రజలు ఇళ్ల బయట నిద్రిస్తున్న తరుణాన్ని ఆసరాగా చేసుకుని గుర్తుతెలియని దొంగ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. గ్రామానికి చెందిన కప్పరి యాదమ్మ అనే వృద్ధురాలు ఇంటి బయట నిద్రిస్తుండగా, ఆమెపై పడ్డ దొంగ మెడలోని సుమారు 5 తులాల బంగారు గొలుసుతో పాటు కొంత నగదును బలవంతంగా లాక్కొని పరారయ్యాడు.అయితే బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో, పట్టుబడతానేమోననే కంగారులో దొంగ తను వచ్చిన మోటార్ సైకిల్ను, చెప్పులను ఘటనా స్థలంలోనే వదిలిపెట్టి కాలినడకన పారిపోయాడు. ఈ ఘటనపై బాధితురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, దొంగ వదిలివెళ్లిన బైక్ నెంబర్, ఇతర ఆధారాల సహాయంతో క్లూస్ సేకరిస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

