పెద్దపల్లిలో త్వరలోనే ఆర్టీసీ బస్ డిపో ప్రారంభం: మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ విజయ రమణారావులతో కలిసి స్థలాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం
పెద్దపల్లి,వి90 న్యూస్,మే 31: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా ప్రతిపాదించిన ఆర్టీసీ బస్ డిపో స్థలాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ అడ్లూరి విజయ రమణారావులతో కలిసి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా బస్ డిపో నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతంగా అమలువుతుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో బస్సులకు డిమాండ్ విపరీతంగా పెరిగిందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త బస్సుల కొనుగోలు ప్రక్రియను కూడా చేపట్టామని వివరించారు. దీనిద్వారా గ్రామీణ ప్రాంతాల కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అలాగే, ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, త్వరలోనే గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహించి, కార్మికులతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం భవిష్యత్తులో విలీన ప్రక్రియను ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా వెల్లడించారు.

