ఓటర్ల వెరిఫికేషన్ ప్రక్రియపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయని బీజేపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, జూన్ 01: తెలంగాణ రాష్ట్రంలో గత ఇరవై ఏళ్లుగా చనిపోయిన వారి పేర్లు, ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు ఉండటం, వివిధ జిల్లాల్లో ఓట్ల మార్పిడి జరగకపోవడం వంటి అక్రమాల వల్లే ఆయా పార్టీలు అధికారంలోకి వచ్చాయని విమర్శించింది. దేశంలో రాజ్యాంగబద్ధంగా ఇప్పటివరకు 11 సార్లు ఈ తరహా వెరిఫికేషన్ ప్రక్రియ (SIR) విజయవంతంగా జరిగిందని, ఇప్పుడు జరుగుతోంది 12వ సారి మాత్రమేనని స్పష్టం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్రంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంతో బీజేపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, అయినా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ అవినీతి ఎక్కడ బయటపడుతుందోననే భయంతోనే అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడింది.ప్రస్తుతం ప్రతి పోలింగ్ బూత్లో సగటున 50 నుండి 100 వరకు డబుల్ ఓట్లు, చనిపోయిన వారి ఓట్లు ఉన్నాయని, అలాంటి తప్పులను సవరించడంలో తప్పేమిటని బీజేపీ ప్రశ్నించింది. 2012 ఓటర్ల జాబితాను ప్రాతిపదికగా తీసుకుని, ఆధునిక మ్యాపింగ్ సాంకేతికత ద్వారా ఇంటింటికీ వెళ్లి ఓట్ల నమోదు , సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన స్థానిక నాయకులు, వార్డు సభ్యులు సైతం తమ ప్రాంతాల్లోని ఓట్ల సవరణను లోలోపల స్వాగతిస్తున్నప్పటికీ, ఆయా పార్టీల అగ్ర నాయకత్వం మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసమే దీనిని వ్యతిరేకిస్తోందని ఆరోపించింది. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు , అర్హులైన వారికే ఓటు హక్కు దక్కేలా చూసేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రతి పోలింగ్ బూత్ వద్ద దగ్గరుండి ఓటర్ల నమోదు, సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.

