జమ్మికుంటలో నీటి కొరత: ప్రజలందరూ సహకరించాలి, ఖాళీ ప్లాట్లలో నల్లా కనెక్షన్లకు డమ్మీలు వేయాలన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్)
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 02: జమ్మికుంట పట్టణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్ ) ఒక ముఖ్య ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత ఎండాకాలంలో పట్టణంలో నల్లా నీటి కొరత ఉన్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. ఈ నీటి ఎద్దడిని అధిగమించడానికి పట్టణ ప్రజలందరూ మున్సిపాలిటీకి పూర్తి స్థాయిలో సహకరించాలని ఆయన కోరారు. ముఖ్యంగా నల్లా నీరు వచ్చే సమయంలో ప్రజలు తమకు అవసరమైన నీటిని పట్టుకున్న వెంటనే నల్లాలను డమ్మీలతో గట్టిగా మూసివేయాలని, తద్వారా నీటి వృధాను అరికట్టవచ్చని సూచించారు. చాలా చోట్ల ఖాళీ ప్లాట్లలో ఉన్న నల్లా కనెక్షన్ల ద్వారా నీరు వృధాగా పోతోందని, అలాంటి చోట్ల కూడా వెంటనే డమ్మీలు అమర్చాలని ఆయన స్పష్టం చేశారు.పట్టణంలోని ఏ వార్డులోనైనా నీటి సమస్య తలెత్తితే, అక్కడ ట్యాంకర్ల ద్వారా ఉచితంగా నీటిని సరఫరా చేయడానికి మున్సిపాలిటీ సిద్ధంగా ఉందని చైర్మన్ భరోసా ఇచ్చారు. ఎవరికైనా నీటి ఇబ్బందులు ఉంటే వెంటనే స్థానిక కౌన్సిలర్లను గానీ లేదా మున్సిపల్ కార్యాలయంలో తమను గానీ సంప్రదించాలని, తక్షణమే ట్యాంకర్ ద్వారా నీటి కొరతను తీరుస్తామని తెలిపారు. ఎండాకాలం దృష్ట్యా నీటిని పొదుపుగా వాడుకుంటూ, మున్సిపల్ యంత్రాంగానికి ప్రజలందరూ బాధ్యతగా సహకరించాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

