ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని అద్భుత ప్రతిభ: బాసర ఐఐఐటీలో సీటు సాధించిన ఇప్పల్ నర్సింగాపూర్ యుపీఎస్ విద్యార్థిని అభినయశ్రీ
కరీంనగర్/హుజురాబాద్,వి90 న్యూస్,జూన్ 02: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని, పట్టుదలతో చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని హుజూరాబాద్ మండలం ఇప్పల్ నర్సింగాపూర్ గ్రామానికి చెందిన కళ్లెపు అభినయశ్రీ నిరూపించింది. ఇప్పల్ నర్సింగాపూర్ ఉన్నత ప్రాథమిక పాఠశాల (UPS)లో చదివిన ఈమె, ఇటీవల విడుదలైన బాసర ఐఐఐటీ (RGUKT) ఫలితాలలో సీటు సాధించి రికార్డు సృష్టించింది. క్రాంతి కుమార్ కుమార్తె అయిన అభినయశ్రీ చిన్నతనం నుంచే చదువులో చురుగ్గా ఉంటూ ఉపాధ్యాయుల ప్రశంసలు అందుకునేది. ఎలాంటి కార్పొరేట్ హంగులు లేని గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలలో చదివినప్పటికీ, కఠినమైన పోటీని తట్టుకుని ప్రతిష్టాత్మక సంస్థలో సీటు కైవసం చేసుకోవడంతో అటు కుటుంబంలోనూ, ఇటు గ్రామంలోనూ పండగ వాతావరణం నెలకొంది. తమ కుమార్తె ఉన్నత చదువులకు ఎంపిక కావడంపై తండ్రి క్రాంతి కుమార్ అపరిమిత ఆనందం వ్యక్తం చేశారు.ఈ ఘనత సాధించిన అభినయశ్రీని ఇప్పల్ నర్సింగాపూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో అభినయశ్రీని, ఆమె తల్లిదండ్రులను శాలువాతో ఘనంగా సత్కరించి మిఠాయిలు తినిపించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో అనంతమైన ప్రతిభ దాగి ఉందనడానికి అభినయశ్రీ సాధించిన విజయమే నిదర్శనమని, క్రమశిక్షణ, నిరంతర శ్రమతో ఆమె తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిందని ఉపాధ్యాయులు కొనియాడారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ అభినందన కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ ప్రముఖులు, తోటి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభినయశ్రీకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

