జమ్మికుంట సహకార సంఘం కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు: జాతీయ జెండాను ఆవిష్కరించిన చైర్మన్ పొనగంటి సంపత్
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 02: జమ్మికుంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) కార్యాలయంలో తెలంగాణ 13వ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సహకార సంఘం చైర్మన్ పొనగంటి సంపత్, తెలంగాణ సహకార సంఘాల మాజీ అధ్యక్షుడు తక్కల్లపల్లి రాజేశ్వర రావు, కార్యాలయ డైరెక్టర్లు , సిబ్బందితో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి, అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని ఈ సందర్భంగా వారు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ పొనగంటి సంపత్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించారని కొనియాడారు. గత పది సంవత్సరాల కాలంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగించి, తెలంగాణను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలిపిన ఘనత ఆయనకే దక్కుతుందని స్పష్టం చేశారు. ఎందరో త్యాగధనుల బలిదానాలతో ఏర్పడిన మన తెలంగాణ పునర్నిర్మాణం కోసం, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో సహకార సంఘం డైరెక్టర్లు, కార్యాలయ సిబ్బంది , స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

