పర్యావరణానికి విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు: వరి కొయ్యలు కాల్చిన రైతుకు రూ. 5000 జరిమానా
జగిత్యాల,వి90 న్యూస్,జూన్ 06: కథలాపూర్ మండలంలో పర్యావరణ నియమాలను ఉల్లంఘించి వరి కొయ్యలను తగలబెట్టిన ఒక రైతుకు అధికారులు గట్టి షాక్ ఇచ్చారు. మండల పరిధిలోని రాజారాంతండా గ్రామంలో వరి పంట కోతల అనంతరం పొలంలో మిగిలిపోయిన వరి కొయ్యలకు (వ్యర్థాలు) ఒక రైతు నిప్పు పెట్టాడు. పొలాల్లో ఇలా పంట వ్యర్థాలను కాల్చడం వల్ల పర్యావరణం కలుషితం కావడంతో పాటు భూమిలోని మిత్రపురుగులు చనిపోయి భూసారం దెబ్బతింటుందని, పక్కనే ఉన్న ఇతర పొలాలకు సైతం ప్రమాదం పొంచి ఉంటుందని అధికారులు ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు.ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ వరి కొయ్యలను తగులబెట్టిన వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన రాజారాంతండా గ్రామ పంచాయతీ కార్యదర్శి సదరు రైతుకు రూ. 5,000 భారీ జరిమానా (ఫైన్) విధించారు. రైతులెవరూ కూడా తమ పొలాల్లో పంట వ్యర్థాలను, వరి కొయ్యలను కాల్చవద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా సరే చట్టపరమైన చర్యలతో పాటు భారీగా జరిమానాలు విధిస్తామని ఈ సందర్భంగా అధికారులు గట్టిగా హెచ్చరించారు.

