జమ్మికుంటలో ఈనెల 11న ప్రకృతి వ్యవసాయ రైతు సమ్మేళనం: విజయవంతం చేయాలని గంగాడి కృష్ణారెడ్డి పిలుపు
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 08: రైతాంగానికి ఎంతగానో మేలు చేసే ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు బిజెపి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈనెల 11న జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో తలపెట్టిన రైతు సమ్మేళనాన్ని భారీ ఎత్తున విజయవంతం చేయాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం రోజున జమ్మికుంటలో స్థానిక బిజెపి నేతలతో కలిసి రైతు సమ్మేళన కార్యక్రమానికి సంబంధించిన సన్నాహక సమావేశాన్ని ఆయన నిర్వహించారు.ఈ సందర్భంగా గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ, రసాయన ఎరువులు మరియు పురుగుల మందుల వాడకాన్ని గణనీయంగా తగ్గించి, పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం (నాచురల్ ఫార్మింగ్) వైపు రైతులను మళ్లించాలనే ఉద్దేశంతోనే పార్టీ ఆధ్వర్యంలో ఈ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భూసారాన్ని కాపాడుకుంటూ ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడంలో ప్రకృతి వ్యవసాయం పోషించే ప్రాముఖ్యతను వివరించడానికి బిజెపి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఇలాంటి సమ్మేళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఆయన గుర్తుచేశారు. జమ్మికుంటలో జరిగే ఈ ప్రతిష్టాత్మక రైతు సమ్మేళన కార్యక్రమానికి కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని ఆయన వెల్లడించారు.

జిల్లాలోని రైతులు, వ్యవసాయ అనుబంధ రంగాల వారు, బిజెపి నాయకులు , కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సన్నాహక కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజు, మండల అధ్యక్షుడు రమేష్ యాదవ్, ఇల్లంతకుంట మండల అధ్యక్షుడు వెంకటరమణ రెడ్డి, హుజురాబాద్ పట్టణ, మండల అధ్యక్షులు తుర్పాటి రాజు, కొండల్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి, ఆకుల రాజేందర్, ఓజ్జా శ్రీనివాస్, పుప్పాల రఘు, కైలాసకొటి గణేష్, ప్రశాంత్, ఆడువాల శ్రీధర్, కౌన్సిలర్లు కొలకాని రాజకుమారి, తుర్పాటి చందన-శంకర్ తదితరులు పాల్గొని కార్యక్రమ విజయవంతానికి ప్రణాళికలు రచించారు.

