పట్టణ అభివృద్ధే లక్ష్యం.. వార్డుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు: చైర్మన్ ప్రశాంత్ కుమార్, కమిషనర్ మల్లికార్జున స్వామి
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 08: జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక–99 రోజుల కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ముమ్మరంగా వార్డ్ సభలను నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్), మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి తెలిపారు. సోమవారం పట్టణంలోని 5, 7, 17, 18, 22, 25, 27, 30వ వార్డుల్లో నిర్వహించిన వార్డ్ సభల్లో వారు స్వయంగా పాల్గొని, మున్సిపాలిటీ పరిధిలో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయా వార్డుల్లో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను నేరుగా గుర్తించి, వాటి తక్షణ పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. పట్టణ పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలను ప్రజలందరూ తప్పనిసరిగా పాటించాలని ఈ సందర్భంగా వారు సూచించారు.

అలాగే జల్ సంచయ్ – జల్ భాగీదారి కార్యక్రమంలో భాగంగా భూగర్భ జలాల పెంపుకై ప్రతి ఇంటిలో రైన్వాటర్ హార్వెస్టింగ్ (వర్షపు నీటి నిల్వ) నిర్మాణాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వార్డుల్లో డ్రైన్ల పూడికతీత, నిరంతర శుభ్రపరిచే పనులు, రుతుపవనాల సన్నద్ధత, అంతరాయం లేని తాగునీటి సరఫరా నిర్వహణ, దోమల నివారణకై నీటి నిల్వల తొలగింపు, ముమ్మర పారిశుధ్య చర్యలు, అంతర్గత రోడ్ల మరమ్మతులు, వీధి దీపాల ఏర్పాటు, మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజా ఫిర్యాదుల త్వరితగతిన పరిష్కారం వంటి కీలక అంశాలపై వార్డ్ సభల్లో విస్తృతంగా చర్చించినట్లు వెల్లడించారు.వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా అవసరమైన అన్ని అభివృద్ధి, పారిశుధ్య పనులను వేగవంతం చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. ఈ వార్డ్ సభల కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు భాస్కర్, శ్రీనివాస్, ఐ. రమేష్లతో పాటు కౌన్సిలర్లు యాట్ల సునీత అశోక్, ఫిరోజ్, బత్తు లక్ష్మణ్, కుతాడి తిరుపతి, శీలం శ్రీనివాస్, చందా రాజు, ఆయా వార్డుల ప్రత్యేక అధికారులు , పెద్ద సంఖ్యలో స్థానిక వార్డు ప్రజలు పాల్గొని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

