నీతిగా పనిచేసే జర్నలిస్టులపై దాడులకు పాల్పడితే తాట తీస్తా: టైగర్ పురం సంతోష్ కుమార్ సీరియస్ వార్నింగ్
హైదరాబాద్,వి90న్యూస్,జూన్ 08: సమాజంలో నిరంతరం శ్రమిస్తూ, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, బెదిరింపుల పట్ల పవర్ ఆఫ్ యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్ అసోసియేషన్ (POYNCA) అంతర్జాతీయ అధ్యక్షులు , పీవీసి న్యూస్ ఛైర్మన్ టైగర్ పురం సంతోష్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిజాయితీగా వార్తలు రాసే విలేకరులపై రాజకీయ నాయకులు, అక్రమార్కులు ఫోన్లలో బెదిరింపులకు దిగడం, దౌర్జన్యాలు , హత్యాయత్నాలకు పాల్పడటం వంటి ఘటనలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నెలసరి జీతం లేకపోయినా ఎండనక, రేయనక కష్టపడుతున్న జర్నలిస్టుల ఓపికను పరీక్షించవద్దని, తమ తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.త్వరలోనే సుప్రీంకోర్టు జర్నలిస్టుల రక్షణ కొరకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురాబోతోందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. జర్నలిస్టులపై దాడులు, రౌడీయిజానికి పాల్పడే వారిపై తక్షణమే ‘రౌడీ షీట్’ , క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులకు టైగర్ పురం సంతోష్ కుమార్ గట్టిగా విజ్ఞప్తి చేశారు.

