విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం: లాడిల్ పేలి ఎనిమిది మంది కార్మికులు దుర్మరణం
ఆంధ్రప్రదేశ్/విశాఖ,వి90 న్యూస్,జూన్ 08: విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో (స్టీల్ప్లాంట్) భారీ ప్రమాదం సంభవించింది. ప్లాంట్లోని మెటల్ లిక్విడ్ లాడిల్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఈ ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాద తీవ్రతకు అక్కడికక్కడే ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు సంభవించిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడటంతో కర్మాగారంలో దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది తక్షణమే రంగంలోకి దిగి మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. కర్మాగారంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో ప్లాంట్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణభయంతో అందరూ కర్మాగారం వెలుపలికి పరుగులు తీశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం తెలుసుకున్న ఉన్నతాధికారులు, రెస్క్యూ టీమ్లు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

