హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ సభకు అనుమతి నిరాకరణ: కోర్టును ఆశ్రయించిన జనసేన నేతలు
హైదరాబాద్,వి90న్యూస్,జూన్ 01: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో రేపు (జూన్ 2న) నిర్వహించతలపెట్టిన భారీ బహిరంగ సభకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం , పోలీసులు అనుమతి నిరాకరించారు. గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ సెంటర్లో “తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ” పేరిట ఈ సమావేశాన్ని నిర్వహించేందుకు జనసేన నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే, శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందనే కారణంతో పాటు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ బందోబస్తు విధులను అడ్డుగా చూపుతూ సైబరాబాద్ పోలీసులు ఈ సభకు అనుమతి ఇవ్వలేదని వెల్లడించారు. ప్రభుత్వం , పోలీసుల నిర్ణయంపై జనసేన శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే సభకు సంబంధించిన ఏర్పాట్లు ముగియడంతో, ఈ వ్యవహారంపై న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. పోలీసుల నిరాకరణ ఉత్తర్వులను సవాలు చేస్తూ, సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ జనసేన ముఖ్య నాయకులు అత్యవసరంగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే అంశంపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.

