జమ్మికుంటలో నీటి ఎద్దడిపై మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ ప్రత్యేక దృష్టి: ఇంటింటికీ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 01: జమ్మికుంట పట్టణ పరిధిలోని పలు వార్డులలో తాగునీటి కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే సమాచారంపై మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) తక్షణమే స్పందించారు. పట్టణంలోని 30వ వార్డులో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ట్యాంకర్ల ద్వారా ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేస్తున్న కార్యక్రమాన్ని ఆయన క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వార్డులో పర్యటించిన చైర్మన్, స్థానిక ప్రజలతో మాట్లాడి నీటి సమస్య తీవ్రతను , వారి ఇతర అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన స్థానికులకు భరోసా ఇచ్చారు.అనంతరం మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ, జమ్మికుంట పట్టణ పరిధిలోని మొత్తం 30 వార్డులలో ఎక్కడ నల్లా నీటి కొరత ఉన్నా, ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా నిరంతరాయంగా నీటిని సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు. తాగునీటి సమస్య తలెత్తిన వెంటనే ప్రజలు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకురావాలని, ఏ వార్డులో ఇబ్బంది ఉన్నా తక్షణమే స్పందించి ట్యాంకర్లను పంపిస్తామని స్పష్టం చేశారు. పట్టణ ప్రజలందరికీ తాగునీరు అందుబాటులో ఉంచడమే తమ మొదటి ప్రాధాన్యతని, ఈ నీటి ఎద్దడి సమస్య పూర్తిగా తీరేవరకు మున్సిపల్ సిబ్బంది నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తారని ఆయన తెలియజేశారు.

