రైతుల రోడ్డు సమస్యపై స్పందన: ఎంఆర్ఓతో కలిసి స్థలాన్ని పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 01: జమ్మికుంట పట్టణ పరిధిలోని ధర్మారం శివారు కొత్తపల్లి సబ్ స్టేషన్ నుండి రామన్నపల్లి గ్రామానికి చెందిన రైతులు తమ వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లే దారి విషయంలో నెలకొన్న వివాదంపై మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) తక్షణమే స్పందించారు. రైతులు రాకపోకలు సాగించే ఈ దారికి అడ్డంగా ఎన్పీడీసీఎల్ (NPDCL) అధికారులు గోడ నిర్మిస్తున్నారనే సమాచారం అందిన వెంటనే, ఆయన స్థానిక ఎంఆర్ఓతో కలిసి వివాదాస్పద స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా సదరు స్థలం సబ్ స్టేషన్కు సంబంధించింది కాదని, అది దశాబ్దాలుగా రైతులు వాడుకుంటున్న రోడ్డు అని స్థానిక రైతులు చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు.ఈ సమస్యపై మున్సిపల్ చైర్మన్ ఎన్పీడీసీఎల్ ఈఈ (EE) తో ఫోన్ ద్వారా మాట్లాడి, సమగ్రంగా చర్చించారు. సదరు స్థలం రైతులకు సంబంధించిన రోడ్డు అని తేలితే ఎన్పీడీసీఎల్ వారు తమ నిర్మాణాన్ని పక్కకు జరుపుకోవాలని, ఒకవేళ అది సాంకేతికంగా ఎన్పీడీసీఎల్ వారి స్థలమే అయితే రైతులు పక్కనుండి వెళ్లేలా ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపాలని స్పష్టం చేశారు. రైతుల వ్యవసాయ పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా అధికారులు చొరవ తీసుకుని ఈ భూ వివాద సమస్యను త్వరితగతిన, శాంతియుతంగా పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రామన్నపల్లి గ్రామానికి చెందిన రైతులు , స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

