రాజారం, కొత్తపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ
మంచిర్యాల,వి90 న్యూస్, జూన్ 01: కోటపల్లి మండలంలోని రాజారం, కొత్తపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం ద్వారా నిర్మించిన నూతన గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై, రిబ్బన్ కట్ చేసి ఈ ఇళ్లను అధికారికంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా నూతన గృహాల్లోకి అడుగుపెట్టిన లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో కలిసి వారు సంతోషాన్ని పంచుకున్నారు. కొత్త ఇంటి యజమానులకు అభినందనలు తెలియజేస్తూ, ఆయా కుటుంబాలు నూతన గృహాల్లో ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, నిరుపేద కుటుంబాల సొంతింటి కలను నిజం చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి గృహ వసతి కల్పించి, వారి జీవితాల్లో ప్రభుత్వం గట్టి భరోసా నింపుతోందని నొక్కి చెప్పారు. అనంతరం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత సొంతింటి కల నెరవేరినప్పుడు పేద ప్రజల ముఖాల్లో కనిపించే ఆనందమే ప్రభుత్వానికి నిజమైన సంతోషాన్ని, తృప్తిని ఇస్తుందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని వివరించారు. ఈ సంతోషకరమైన కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ నాయకులు , పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.

