జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు: జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్)
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 02: ఎందరో అమరుల త్యాగఫలం వల్లనే నేడు తెలంగాణ రాష్ట్రం సాకారమైందని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) పేర్కొన్నారు. జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జమ్మికుంట మున్సిపల్ కార్యాలయం వద్ద ఆయన జాతీయ పతాకాన్ని అత్యంత ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం గాంధీ చౌరస్తాలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ ఉద్యమ అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అలాగే ప్రజా గాయకుడు గద్దర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్( దిలీప్) మాట్లాడుతూ, జమ్మికుంట పట్టణ ప్రజలకు, యావత్ తెలంగాణ ప్రజానీకానికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నాడు విద్యార్థి నాయకుడిగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నో పోరాటాలు చేశానని, ఆ క్రమంలో కేసులు ఎదుర్కొంటూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగిన రోజులను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

నాడు ఉద్యమకారుడిగా పోరాడిన తాను, నేడు జమ్మికుంట పట్టణ ప్రజల ఆశీర్వాదంతో మున్సిపల్ చైర్మన్ హోదాలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం అత్యంత సంతోషాన్ని, గర్వాన్ని ఇస్తోందని భావోద్వేగానికి లోనయ్యారు. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన విద్యార్థులను, అమరవీరులను స్మరించుకుంటూ ఆయన స్వయంగా “వీరులారా వందనం” అంటూ గేయాన్ని ఆలపించి అందరిలో ఉద్యమ స్ఫూర్తిని నింపారు. ఈ ఘనమైన వేడుకల్లో మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్, మేనేజర్ జి. రాజిరెడ్డిలతో పాటు కౌన్సిలర్లు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది , స్థానిక తెలంగాణ ఉద్యమకారులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

