విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలి: ఏబీవీపీ ప్రాంత SFD కో-కన్వీనర్ అజయ్ డిమాండ్
కరీంనగర్/హుజరాబాద్ ,వి90 న్యూస్ జూన్ ,09: ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలని, ప్రభుత్వ పాఠశాలల్లో తక్షణమే మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ హుజరాబాద్ శాఖ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారికి (MEO) వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ ప్రాంత SFD కో-కన్వీనర్ అజయ్ మాట్లాడుతూ, మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, తరగతి గదులు, ఫర్నిచర్, ప్రహరీ గోడలు , డిజిటల్ విద్యా సదుపాయాలు వంటి ప్రాథమిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యనందించేందుకు వీటన్నింటినీ వెంటనే కల్పించాలని ఆయన కోరారు.మరోవైపు కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను ఆర్థికంగా దోపిడీ చేస్తున్నాయని విమర్శించారు. నిర్దిష్ట దుకాణాల్లోనే పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు కొనాలని ఒత్తిడి తెస్తూ అక్రమ విక్రయాలకు పాల్పడుతున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ప్రభుత్వ అనుమతులు, కనీస నిబంధనలు లేకుండా నడుస్తున్న గుర్తింపు లేని పాఠశాలలపై సమగ్ర విచారణ జరిపి వాటిని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోని యెడల రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నగర సంయుక్త కార్యదర్శి అరుణ్, ప్రవీణ్, నిశాల్, సత్యసాగర్, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.

