అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల మెరుపు దాడి: మూడు ట్రాక్టర్లు సీజ్, కేసు నమోదు
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 13: జమ్మికుంట మండల పరిధిలో అక్రమ ఇసుక రవాణాదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. శనివారం జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పోలీసులు మెరుపు దాడి చేసి పట్టుకున్నారు.విలాసాగర్ పరిసర ప్రాంతాల నుండి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోందన్న నమ్మదగిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి గ్రామంలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఇసుక లోడుతో వెళ్తున్న మూడు ట్రాక్టర్లను పోలీస్ సిబ్బంది అడ్డుకున్నారు. వాటికి సంబంధించిన ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో మూడు వాహనాలను తక్షణమే స్వాధీనం చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని, స్వయంగా ట్రాక్టర్లను నడుపుకుంటూ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ మేరకు వాహనాలను సీజ్ చేసి, అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.అక్రమ ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్న పోలీస్ సిబ్బందిని జమ్మికుంట పట్టణ సిఐ రామకృష్ణ గౌడ్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండల పరిధిలో ప్రభుత్వ సహజ వనరులను అక్రమంగా తరలిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా ఇసుక, ఇతర మైనింగ్ రవాణాకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా, వాహనాలను సీజ్ చేస్తామని సిఐ రామకృష్ణ గౌడ్ హెచ్చరించారు.

