మున్సిపల్ కార్మికుల రిలే దీక్షలకు మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) పూర్తి మద్దతు
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 18: తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ (సిఐటియు) పిలుపులో భాగంగా మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) నేరుగా హాజరై తమ పూర్తి మద్దతును ప్రకటించారు. దీక్షలో కూర్చున్న కొలుగురి తిరుపతి, శ్రీనివాస్, రాసపల్లి సంజీవ్, మరేపల్లి ప్రశాంత్ తదితరులను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. మున్సిపల్ కార్మికులు కోరుతున్న డిమాండ్లు అత్యంత న్యాయమైనవని, వారి సమస్యల పరిష్కారానికి తన వంతుగా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి గట్టిగా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.మున్సిపాలిటీలలో ఎన్నో ఏళ్లుగా విధి నిర్వహణలో ఉన్న ఔట్సోర్సింగ్, ఎన్ఎమ్ఆర్, ఫిక్స్ పే కార్మికులను తక్షణమే పర్మినెంట్ చేయాలని, అలాగే రెండవ పిఆర్సిని ప్రకటించి కనీస వేతనం 26 వేల రూపాయలుగా నిర్ణయించి కేటగిరీల వారీగా అమలు చేయాలని చైర్మన్ డిమాండ్ చేశారు. వీటితో పాటు కార్మికులకు మొదటి ప్రాధాన్యత కింద డబుల్ బెడ్రూమ్స్ లేదా ఇందిరమ్మ ఇళ్లు, ఇండ్ల స్థలాలు కేటాయించాలని, విధి నిర్వహణలో కార్మికులు మరణిస్తే అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం 30 వేల రూపాయలు తక్షణ సహాయం అందించాలని కోరారు. కార్మికులకు ఒక్కపూట ఎనిమిది గంటల పని విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని, ప్రతి సంవత్సరం శానిటేషన్, వాటర్ వర్క్స్, హరితహారం, ఎలక్ట్రిషియన్, డ్రైవర్లకు అవసరమైన రక్షణ పరికరాలను తప్పనిసరిగా అందజేయాలని పేర్కొన్నారు. మున్సిపల్ పరిధిలో పనిచేసే డ్రైవర్లకు, జవాన్లకు ఇతరుల మాదిరిగానే డ్రైవర్ కేటగిరీ వేతనాన్ని వర్తింపజేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కార్మికుల న్యాయపోరాటానికి ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని స్పష్టం చేసిన ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కొలుగురి సురేష్, ఫిరోజ్, మంద రాజేష్, శంకర్ తదితరులు పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు.

